Tuesday, April 28, 2009

ఈ ప్రపంచం పోకడ: ఆర్ధిక మాంద్యం

ఏవిటో అప్పుడప్పుడు ఈ ప్రపంచం పోకడ బోధపడి చావదు నాకు. అప్పుడే ఈ ఆర్ధిక మాంద్యం మొదలయి ఏణ్ణర్ధం కావస్తోంది. మాంద్యం ఏమిటి నా మొహం! "మాంద్యం" అంటే చైతన్యం సన్నగిల్లటం. ఇప్పటి పరిస్థితి - ఆటు లో సముద్రంలా - వెనక్కి వెళుతోంది. ఇది అల్పపీడనపు ద్రోణిలా మారి అందరినీ ఒక సుడిగుండంలో ముంచెయ్యకుండా ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ ఆర్ధిక దుస్తితి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా - పర్యావరణానికి కొంత మంచి కూడా జరుగుతోంది. మూతపడ్డ కర్మాగారాలు వాతావరణంలోకి కాలుష్యాలని విసర్జించటం తగ్గించేయి. ఉద్యోగాలు ఊడిన వాళ్ళు, జేబుల్లో డబ్బులు లేక కార్లలో షికారులు తగ్గించేరు. ఇంటిపట్టున ఉన్నప్పుడు వాయునియంత్రణ సౌకర్యాలకి స్వస్తి చెప్పి, కిటికీలు తెరుచుకుని, విసనకర్రలతో విసురుకుంటున్నారు. ఆదాయం తగ్గిపోయిన కంపెనీలలో మిగిలిన ఉద్యోగస్తులు విమానాల ప్రయాణాలు తగ్గించి, ముఖాముఖీ సమావేశాలకి బదులు టెలిఫోను వాడకం అలవాటు చేసుకుంటున్నారు. వీటన్నిటి పర్యవసానం ఏమిటంటే అమెరికాలో, 2008 లో, పెట్రోలు వాడకం ఆరు శాతం తగ్గిపోయింది. ఆ ప్రాప్తికి వాతావరణంలో ప్రవేశించే కర్బనం శాతం కూడా తగ్గింది.

ఈ ప్రపంచం నడవటానికి రెండు మూలశక్తులు కావాలి. ఒకటి అప్పు, రెండు ఇంధనం. మన దురదృష్టం కొద్దీ ఆర్ధిక విపత్తు, ఇంధనపు విపత్తు, రెండూ ఒక్కసారే వచ్చిపడ్డాయి. దీనికి కారణం ఈ రెండు పైపైకి వేర్వేరుగా కనిపించినా ఇవి రెండూ ముడిపడ్డ సమశ్యలు. ఇంధనం (బొగ్గు, రాతిచమురు, సహజవాయువులు) మన కండ బలానికి ప్రవర్ధకి (amplifier) అయితే అప్పు మన జేబులో ఉన్న డబ్బుకి ప్రవర్ధకి. మన కండబలంతో చెయ్యలేనివి ఎన్నో యంత్రాలు ఉపయోగించి చెయ్యగలుగుతున్నాం. మన సొంత డబ్బుతో చెయ్యలేనివి ఎన్నో అప్పు చేసి చెయ్యగలుగుతున్నాం. ఈ రెండింటి సహాయంతోటే పారిశ్రామిక విప్లవం సాధ్యం అయింది. ఈ రెండు శక్తుల మధ్య అదృశ్యమైన తుల్యత (చైనా వారి ఇంగ్-యాంగ్ లా) ఉన్నంతసేపూ ఈ బండి సజావుగా నడుస్తుంది. కాని అప్పుడప్పుడు - మంచి ఉద్దేశ్యం తోటో, ఓట్ల కొరకో - ప్రభుత్వాలు ఈ పాత్రలో వేళ్ళు పెట్టి కెలుకుతాయి. దాని పర్యవసానం ఎలాగుంటుందో చూద్దాం.

2008 వేసంగిలో పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు దాటింది కదా. అలవాట్లు మార్చుకున్నాను. కారు తోలటం తగ్గించి బస్సులు, బార్టు (BART) వాడటం పెంచేను; పర్సుకీ పర్యావరణానికీ కూడా మంచిదనుకుంటూ సమర్ధించుకున్నాను. చాల రోజులబట్టి కొత్త కారు కొనుక్కుందామని సరదా పడ్డవాడిని ఆ ప్రణాళికకి స్వస్తి పలికేను. ఏదో గుడ్డిలో మెల్ల పర్యావరణ కాలుష్యం తగ్గటానికి చంద్రుడికోనూలు పోగులా నేనూ ఇతోధికంగా సహాయపడుతున్నానని సంతోషించేను. నా లాగే చాల మంది కార్లు కొనటం మానేశారు. దాంతో అమెరికాలో రెండు కార్ల కంపెనీలు దివాలా ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాయి. నేను కారు కొనుక్కుందామని దాచుకుంటూన్న డబ్బులని, నాతో చెప్పకుండా, నన్ను అడగకుండా, నా జేబులో చెయ్యి పెట్టి లాక్కుని ఆ డబ్బుని ములిగిపోతూన్న కార్ల కంపెనీలకి ఆసరాగా అప్పిచ్చింది అమెరికా ప్రభుత్వం. నా డబ్బూ హరించిపోయింది, కారూ లేక పోయింది.

ప్రజలు కార్లు నడపటం తగ్గిస్తే అది పర్యావరణానికి మంచిదే కాని ప్రపంచపు ఆర్ధిక ఆరోగ్యానికి మంచిది కాదేమో. ఈ విషచక్రం లోంచి బయట పడాలంటే హైబ్రిడ్ కార్లు కొని వాడాలిట. హైబ్రిడ్ కార్లని గేలనుకి 45 మైళ్ళవరకు నడపొచ్చు. అంచేత అవి పర్యావరణాన్ని అంతగా కలుషితం చెయ్యవు. కనుక హైబ్రిడ్ కార్లు అలవాటయిన తరువాత ఇంతకు పూర్వం అయే పెట్రోలు బడ్జెట్ తో రెట్టింపు దూరం వెళ్ళొచ్చు. కనుక పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు అయినా మనకి రెండు డాలర్లకే కిట్టింది కదా. కనుక వెధవది బస్సులలోనూ, బార్టులలోనూ ఎవడు తిరుగుతాడు, మన కారులో మనం రాజాలా తిరగొచ్చు అని అందరూ అనుకుంటే - అనుకుని పూర్వం కంటే ఎక్కువ తిరగటం మొదలుపెడితే - నష్టపోయేది పర్యావరణమే.

హైబ్రిడ్ కార్లు మానేసి ఎలక్ట్రిక్ కార్లు వాడితేనో? ఎలక్ట్రిక్ కార్లు వాడకం పెరిగితే విద్యుత్తు వాడకం పెరుగుతుంది. ఆ విద్యుత్తు ఎక్కడ నుండి వస్తుంది? దానికోసం మరొక పవర్ హౌస్ కట్టాలి కదా. దాంట్లో వాడటానికి బొగ్గో, ఇంధనపు తైలమో వాడాలి కదా. అది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది కదా.

ఈ సమశ్యకి పరిష్కారం నా దగ్గర లేదు కానీ, ఈ సమశ్య ఇప్పటిది కాదని మనవి చేసుకుంటున్నాను. దీని పరిష్కారానికి అమెరికాలో ప్రజలకి ఉపాయాలు తట్టకనూ పోలేదు. వీళ్ళ పరిష్కార ధోరణి ఎలా ఉంటుందో నా స్వానుభవం ద్వారా మనవి చేసుకుంటాను. 1960-1970 దశకంలో పర్యావరణ సమశ్య ప్రజల దృష్టిలో పడటం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో, ఒక వేసంగిలో, నేను కొలంబస్, ఒహాయోలో ఒక వైజ్ఞానిక సమావేశానికి హాజరయేను. రోజల్లా ప్రసంగాలు అయేయి. సాయంకాలం వాయునియంత్రణ ఉన్న హొటేలు గదిలో, కాక్‌టెయిల్ పార్టీ జరుగుతోంది. రెండు చుక్కలు పడ్డ తరువాత అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ పర్యావరణ సమస్యకి ఒక పరిష్కారమార్గం సూచించేరు. వారనేది ఏమిటంటే - మనం అమెరికాలో ఉన్నది 300 మిలియన్లు. ఇండియా, చైనా కలిపి దరిదాపు రెండు బిలియను ప్రజలు ఉన్నారు. వీరందరూ అమెరికాని అనుకరిస్తూ, ప్రగతి పథం వెంబడి ప్రయాణం చేస్తూ, సుఖ సౌఖ్యాలు (అంటే కార్లు, వాయునియంత్రణ యంత్రాలు, మొదలైనవి) కోరటం మొదలు పెట్టేరంటే వాతావరణ కాలుష్యం అపరిమితంగా పెరిగిపోతుంది. వాళ్ళు ఎలాగూ కష్టజీవితానికి అలవాటు పడిపోయేరు. కనుక పర్యావరణ కాలుష్య నియంత్రణ అక్కడ మొదలవాలి..." ఈ ధోరణిలో పోతూన్న ఆ వాక్ప్రవాహం ఎక్కడికెళుతోందో మీ ఊహకి వదిలేస్తాను.

ఇంతలో హొటేల్లో విద్యుత్తు సరఫరాకి అంతరాయం వచ్చింది. దీపాలు లేవు, ఎయిర్ కండిషనర్లు ఆగిపోయాయి. ఆగస్టు నెలేమో ఉక్క విపరీతంగా ఉంది. అప్పటి వరకూ నోరు మూసుకు కూర్చున్న నేను అన్నాను. "ఎందుకలా ఆపసోపాలు పడతారు. ఇండియా, చైనా దేశాల ప్రజలలాగే మనమూ పర్యావరణ ఆరోగ్యానికి దోహదం చేద్దాం."

ఈ కథ ఎందుకు చెప్పొచ్చేనంటే బుష్ ఆధ్వర్యంలో అమెరికా క్యోటో ఒడంబడికకి ఒప్పుకో లేదు. నెల్లాళ్ళ క్రితం కోపెన్‌హేగన్‌లో మరొక సమావేశం అయింది. సుదూర వాతావరణం (climate) గురించి, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచటం గురించి చర్చలు జరిగేయి. ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యం ధర్మమా అని 2008 లో పర్యావరణానికి జరగబోయే హాని జరగలేదు. అంతా ఇండియా, చైనాలదే తప్పు అన్న ధోరణిలో కూడ కొద్దిగా మార్పు కనిపిస్తొంది.

Friday, April 10, 2009

ఖగోళశాస్త్రంలో ఎవరు ముందు?

10 ఏప్రిల్ 2009

ఖగోళశాస్త్రంలో "ఎవరు ముందు?" అనేది ఒక చిక్కు ప్రశ్న? ముఖ్యంగా "ప్రాచ్యులు ముందా? పాశ్చాత్యులు ముందా?" అన్న ప్రశ్న వచ్చేసరికల్లా, "అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి" అని మనవాళ్ళంటారు, "మీ మొహం మీకేమీ తెలియదు" అని మనని మన ప్రజ్ఞని పాశ్చాత్యులు కించపరుస్తూ ఉంటారు. ఈ తగవు రివాజు అయిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఆధారాలు చూపించకుండా మాట్లాడే మన అలవాటు కావచ్చు.

ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.

ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.

"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!
యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం
మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం
ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః
చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః
షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః

ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.

క.
ధీరవ్రత! రాజన్యకు
మారక! నీ హృదయమందు మసలిన కార్య
బారూఢిగా నెరుంగుదు
నారయనది పొందరానిదైనను నిత్తున్

వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారు యేండ్లు సనం బ్రాపింతువు."

దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.

భూ అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?

విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.

ఈ కథ ఇక్కడితో ఆపెస్తే నేను నేనెందుకవుతాను? నాకు మొట్టమొదట ఈ విషయం గురించి అమెరికాలో M. S. డిగ్రీ చేస్తూన్నప్పుడు తెలిసింది. భౌతిక శాస్త్రంలో భూమి కదలికని గురించి అధ్యయనం చేస్తూన్నప్పుడు భూమి గోళాకారంగా ఉండదనిన్నీ, పొట్ట దగ్గర (మనలో చాలమందికి మల్లే?) కైవారం ఎక్కువ అనిన్నీ, దీని వల్ల బొంగరంలా తిరుగుతూన్న భూమి అక్షం స్థిరంగా ధ్రువ నక్షత్రం వైపు ఎల్లప్పుడూ చూపించకుండా ఆ నక్షత్రం చుట్టూ ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గణితం ఉపయోగించి లెక్కకట్టటం నేర్చుకున్నాను. నూటన్ తరువాత గణితపరంగా అవగతమైన ఈ విషయం ఏ పనిముట్లు లేకుండా, ఉత్త కంటితో చూసి గమనించిన మన పూర్వుల ప్రతిభని తలుచుకుని మేమంతా "ఔరా!" అని ఆశ్చర్యపోయేం.

Wednesday, April 8, 2009

మనం ఏమీ చెయ్యలేమా?

8 ఏప్రిల్ 2009

స్విట్జర్లండు బేంకులలోని రహశ్య ఖాతాలలో డెబ్భయ్ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయిట. ఎవ్వరో నాకు ఈ-మెయిల్ చెయ్యగా తెలిసింది!

అయ్యబాబోయ్ 70,00,000 కోట్ల రూపాయలు!!

ఈ ప్రపంచంలో 180 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలవారు అందరూ దొంగచాటుగా డబ్బులు పట్టుకొచ్చి స్విట్జర్లండులో దాచుకోవటంలో వార్తావిశేషం ఏదీ లేదు. కాని ఈ 180 దేశాలలోనూ మన భారతదేశానిదే అగ్రస్థానం ట - ఇలా దొంగచాటుగా డబ్బు దాచటంలో.

ఎవరబ్బా ఇలా దాస్తూన్నది? మన రాజకీయ నాయకులే లంచాలు తినేసి ఇలా ప్రజల సొమ్ముని ఒడికేస్తున్నారని కొందరి ఊహాగానం. అన్ని పార్టీల వారూను.

అక్కడ బేంకులో డబ్బు అలా మూలుగుతూ ఉండగా మన నాయకులు ఇక్కడ టపా కట్టెస్తే ఆ డబ్బు గోవిందా గోవింద. మనం తిన్నది కాదు, మరొకడికి పెట్టింది కాదు. కనీసం తిరపతి హుండీలో వేస్తే పుణ్యం, పురుషార్ధం.

అయ్యబాబోయ్ డెబ్బయ్ లక్షల కోట్ల రూపాయలే నా ఊహకి కూడ అందటం లేదు.

ఈ పరిస్థితికి తరుణోపాయం లేదా? లేకేమి? ఉంది. ఒకటి, ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రెండు, ప్రస్తుతం పదవిలో ఉన్న నాయకులని, గతంలో పదవి అలంకరించిన నాయకులని తప్పించి కొత్త వారిని ఎన్నుకుని చూడాలి. మూడొంతులు వాళ్ళూ తినెస్తారు. అప్పుడు మనం మన కర్మ అని ఉత్తరీయం నెత్తిమీద వేసుకుని భోరుమని ఏడవాలి.

Monday, April 6, 2009

ద్వాదశ రాశులు

6 ఏప్రిల్ 2009

మనం మన దేశంలో వాడే మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, వగైరా ద్వాదశ రాశుల పేర్లనీ ఇంగ్లీషులో వాడే Aries, Taurus, Gemini, ... మొదలైన పేర్లతో పోల్చి చూస్తే వాటి అర్ధాలలో పోలిక కొట్టొచ్చినట్లు కనబడుతుంది కదా. కనుక ఈ పేర్లని మనం ముందు వాడితే మన దగ్గర పాశ్చాత్యులు కాపీ కొట్టయినా ఉండాలి, లేదా వాళ్ళ దగ్గరనుండి మనం కాపీ కొట్టయినా ఉండాలి. పాశ్చాత్యులని అడిగితే ఇది తప్పకుండా భారతీయులు చాల్డియనుల (బాబిలోనియా వాసులని యవనులు పిలచే పేరు. వీరి ఉనికి సా. శ. పూ 6 వ శతాబ్దం) దగ్గర నుండి నిర్మొహమాటంగా కాపీకొట్టేసేరనే అంటారు. ఇంగ్లీషులోనే కాని తెలుగులో కూడ ఆలోచించటం తెలియనిన్నీ, ఇంగ్లీషు పుస్తకాలనే ఉగ్గుపాలతో అవుపోశన పట్టేసిన తెలుగు వాళ్ళని అడిగితే, "మనవాళ్ళు ఒఠ్ఠి వెధవాయిలోయ్! మూడొంతులు ఇంగ్లీషువాడి ఊహే "కరెక్టు" అంటారు. మీరేమంటారు?

ఋగ్వేదంలో దీర్ఘతమస్సు అనే ఋషి మొట్టమొదట పన్నెండు రాశుల ప్రస్తావన చేశాడు: "ద్వాదశ ప్రథయశ్చక్రమేకం త్రీణినభ్యానిక ఉతిచ్చిరేత! తస్మిన్‌త్సాకం త్రిశతాన శంకవోర్సితాః షష్టిర్నచలా చలాసః" - (ఋ I-164-48)

ఇక్కడ నాకు అర్ధం అయినంత మేరకి అర్ధం చెబుతాను. (వేద) సంస్కృతం వచ్చిన పాఠకులు ఎవ్వరయినా టీకా తాత్పర్యాలు చెప్పగలరు. ఇక్కడ ఒక చక్రం ప్రస్తావించబడింది. ఇది సంవత్సరాత్మకమైన కాలచక్రం. చక్రం తిరిగేటప్పుడు నేలని తాకే ప్రథని - పరిధిని - "నేమి" అని కూడ అంటారు. ఈ పరిథి పన్నెండు భాగాలుట. ఈ పన్నెండు భాగాలే రాశులు. ఈ చక్రానికి 360 ఆకులు ఉన్నాయిట. ఈ 360 ఆకులు 360 రోజులు లేదా 360 భాగలు. ఈ భాగలనే మన తెలుగువాళ్ళు డిగ్రీలు అంటారు. ఈ లెక్కని రాశికి 30 భాగలు.

ఇంతే కాదు. మేష రాశి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది: (I-51-1, I-52-2). "మేషానికి అగ్ని వాహనం ఏమిటి? నా బొంద, ఇదేమీ సబబుగా లేదు" అని మీరు అనొచ్చు. ఆకాశంలోకి తలెత్తి చూస్తే మేష రాశి పైన కృత్తిక రాశి ఉంది. కృత్తికలు అగ్ని దేవతలు. కనుక మేషానికి పైన అగ్ని ఉన్నట్లే కదా. లేదా అగ్నికి మేషం వాహనం అన్నమాట.

నేను బ్లాగే మరో స్థలం: http://lolakam.blogspot.com

Friday, April 3, 2009

మరచినదానిని reQall చేసుకోవటం ఎలా?

మరుపుకి మందు

ఏప్రిల్ 2009

మరుపు మనిషికి సహజం. నాలుగు వస్తువులు కొనుక్కురమ్మని నా శ్రీమతి బజారుకి పంపుతుంది. నాకు మరుపెక్కువ అని నాకు తెలుసు కాబట్టి ఒక కాగితం మీద అన్నీ జాగ్రత్తగా రాసుకుంటాను. షాపుకెళ్ళేలోగా ఆ కాగితాన్ని ఎక్కడో పారేసుకుంటాను. ఒకదానికి బదులు మరొకటి పట్టుకొస్తాను. చివాట్లు తింటాను. ఇటువంటి ప్రమాదాలు చాలా మందికి జరుగుతాయి.

David Pogue కొమ్ములు తిరిగిన పత్రికా విలేఖరి. తరచు మరిచిపోయేవారికి అతను ఒక చిట్కా చెప్పేడు. ఈ మూడు నిమిషాల విడియో చూడండి.

Watch video on reQall by david Pogue of NY Times at http://video.nytimes.com/video/playlist/technology/1194811622271/index.html

ఈ లింకు మీద క్లిక్ చెయ్యటానికి కుదరకపోతే ఈ URL ని కాపీ చేసి మీ బ్రౌజర్ లో అతికించండి.
లేదా తిన్నగా reQall.com కి వెళ్ళి అక్కడ ఈ ఉపకరణాన్ని వాడి చూడండి. మీకు దమ్మిడీ ఖర్చు లేదు.