Saturday, January 8, 2011

ఏం? ఎందుకని? - 8

8. చలి లో తిరిగినా వర్షం లో నానినా జలుబు చేస్తుందా?

వర్షం లో నానినంత మాత్రాన, చలి లో తిరిగినంత మాత్రాన జలుబు చెయ్యదు. పడిశం పట్టడానికి కారణం కంటికి కనిపించనంత చిన్న వైరసులు అనబడే సూక్ష్మజీవులు. ఈ వైరసులు బేక్టీరియా కంటె చిన్నవి. ఈ వైరసులలో జలుబు చేసే జాతివి శరీరం లో ప్రవేశించినప్పుడు జలుబు చేస్తుంది. ఫ్లూ కి ఒక రకమైన వైరసులే కారణం. ఈ రెండు రకాల వైరసులు ఒకరి నుండి మరొకరికి అంటుకోవడం బహు తేలిక. తుమ్ముల వల్లనో, కరచాలనం చేసినప్పుడో, లేక జలుబు చేసిన వారు ముట్టుకున్న వస్తువులని ముట్టుకున్నప్పుడో ఇది ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది.

మరి చలిలో తిరిగినా, వర్షంలో నానినా జలుబు చేస్తుందనే అపప్రథ ఎందుకు వచ్చింది? చలిలో తిరిగినా, వర్షంలో నానినా మన శరీరపు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత బాగా తగ్గితే ఆ పరిస్థితిని ఇంగ్లీషులో hypothermia అంటారు. అటువంటి సందర్భంలో శరీరంలో జరగవలసిన రసాయన క్రియలు లేదా చయాపచయ క్రియలు (metabolic activities) సక్రమంగా జరగవు. అటువంటి సందర్భంలో శరీరానికి ఉండవలసిన రోగనిరోధక శక్తి ఉండక పోవచ్చు. అటువంటి సందర్భంలో అప్పటికే శరీరంలో తిష్ట వేసుకున్న సూక్ష్మజీవులు అవకాశం వచ్చింది కదా అని అదును చూసుకుని ఒక దెబ్బ తియ్యవచ్చు.

జలుబు ఒకరి నుండి మరొకరికి సంక్రమించే అంటు వ్యాధి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి అడ్డుగా రుమాలు పెట్టుకోవటం, చేతులని తరచు కడుక్కోవటం వంటి కొన్ని ప్రాథమిక సూత్రాలని పాటిస్తే మనకున్న జలుబు మరొకరికి అంటుకోదు.

Sunday, January 2, 2011

ఏం? ఎందుకని? - 12

12. మన కంటికి ఆముదపు దీపం మంచిదా? విద్యుత్ దీపం మంచిదా?

మన పెద్దవాళ్లంటారు, "ఈ ఎలట్రీ దీపాలు వచ్చాకనే కళ్లజోళ్ళు ఎక్కువయాయి" అని. ఆముదపు దీపాల రోజులల్లో కళ్ల జోళ్ల వాడకం లేనేలేదని వాళ్ల వాదం. మరికొంతమంది "ఏమిట్రా, ఆ గుడ్డి దీపం దగ్గర చదువుతావు, కళ్లు పాడైపోగలవు జాగ్రత్త" అంటారు. ఈ నమ్మకాలలో నిజం ఎంత?

ఆముదపు దీపం అంటే వెలుగు తక్కువ ఇచ్చేదీపం అని అన్వయం చెప్పుకుంటే, వెలుగు తక్కువగా ఉన్న ఏ దీపం దగ్గర చదివినా కంటికేమీ నష్టం లేదు. ప్రమిదలో ఆముదం పోసినా, ఆవు నెయ్యి పోసినా, కిరసనాయిలు పోసినా ఆ దీపం నుండి వచ్చే పొగలో తేడా ఉండొచ్చు కానీ ఆ దీపపు వెలుగులో ఆరోగ్యానికి సంబంధించిన తేడాలు ఉండడానికి వీలు లేదు. కిరసనాయిలు దీపపు పొగకి కళ్లు మండుతాయి కనుక కిరసనాయిలు దీపం కంటె ఆముదపు దీపం మంచిది కావచ్చు.

వెలుతురు తక్కువగా ఉన్న చోట చదివితే కంటికి నష్టం కాదా? వెలుతురు తక్కువగా ఉన్న చోట ఫోటో తీస్తే కెమేరా పాడవుతుందా? పాడవదే. అలాగే వెలుతురు తక్కువగా ఉన్న చోట చదవడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కాని, కన్ను పాడవడానికి అవకాశం లేదు. చీకటికి అలవాటు పడిపోయిన తర్వాత మన కళ్లు చీకటిలో కూడ బాగానే చూడకలవు. అలాగే విద్యుత్ దీపాల వెలుగు కంటికి హాని చేస్తుందనుకోవడానికి నాకు తెలుసున్నంత వరకు దాఖలాలు ఏమీ లేవు.

మరి పూర్వపు రోజుల కంటె ఇప్పుడు కళ్లజోళ్ల వాడకం ఎందుకు పెరిగింది? పూర్వం కళ్ల పరీక్షలకి సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సదుపాయాలు పెరగడంతో చిన్న పిల్లలకి కూడా కళ్ల పరీక్షలు చేసి కళ్లజోళ్లు తొడిగెస్తున్నారు తప్ప కళ్ల జబ్బులు ఎక్కువ అయి ఏమీ కాదు.

ఏం? ఎందుకని? - 11

11. కంటి ముందు గాలి బుడగలు ఎందుకు కనబడతాయి?

ఎప్పుడేనా అలా గోడ కేసి కాని, ఆకాశం కేసి కాని కొంతసేపు చూడండి. కంటికి ఎదురుగా చిన్న చిన్న గాలి బుడగలు, గాలి బుడగలతో చేసిన గొలుసుల లాంటి ఆకారాలు గాలిలో తేలియాడుతూ, ఈదుతూ కనిపిస్తాయి. పట్టుకుందామంటే చేతికి అంకవు. ఆవి నిజానికి కంటి ఎదురుగా లేవు, కంటి లోపల ఉన్నాయి. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కంటి ఎదుగుదలకి రక్తం సరఫరా అవాలి కదా! రక్తాన్ని అలా కంటికి సరఫరా చేసే ధమనిని హయాలిడ్ ధమని అంటారు. కన్ను పరిపూర్ణంగా పెరగడం అయిపోయిన తర్వాత ఈ ధమనితో మరి పని లేదు. కాని దానిని విసర్జించడానికి బయటకి పోయే మార్గం లేదు. కనుక అది నెమ్మదిగా కృశించి, శిధిలమయి, చివికిపోయి చాలమట్టుకి శరీరంలో ఇంకి పోతుంది. కాని దాని అవశేషాలు కొద్దిగా కంట్లో మిగిలిపోతాయి. ఈ అవశేషాలే మన కంటి ఎదుట ఈదులాడుతూ చిన్న చిన్న బుడగలుగా కనిపిస్తాయి.

ఏం? ఎందుకని? - 10

10. నీళ్లల్లో నానినప్పుడు వేళ్ల కొనలు ఎందుకు ముడతలు పడతాయి?

కాలి వేళ్ల మీద, చేతి వేళ్ల మీద దళసరి గాను, దిట్టం గాను ఉన్న చర్మం ఉంది. నీళ్లల్లో నానినప్పుడు నీళ్ళని పీల్చుకుని చర్మం ఉబ్బి వ్యాకోచం చెందుతుంది. ఇలా ఉబ్బిన చర్మం ఎక్కడికీ వెళ్ళలేదుగా! అందుకని ఉన్న చోటే ముడతలు పడి పడుతుంది.

ఏం? ఎందుకని? - 9

9. విభూతి స్నానం అంటే ఏమిటి? ఈ మాట ఎలా పుట్టుకొచ్చింది?

స్నానం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. ఎందుకనో? నీళ్లకీ విభూదికీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో?

ఈ ప్రశ్న కి సమాధానం అట్నించి నరుక్కొద్దాం. ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అని మనందరికీ తెలుసు. కాని నీళ్లు కూడ మరొక రకం బూడిదే అని మనలో ఎంతమందికి తెలుసు? ఉదజని వాయువు ని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్లూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్లు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్లకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టేరా? లేక, ఇది కేవలం కాకతాళీయమా?

Saturday, January 1, 2011

ఏం? ఎందుకని?-7

7. ఉప్పు ఎక్కువ తినడం మంచిదికాదంటారు. ఎందుకని?

ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ఉప్పు సోడియం, క్లోరీన్ అనే రెండు రసాయన మూలకాల సంయోగం వల్ల పుట్టింది కనుక రసాయనులు దీనిని సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. ఈ సోడియమూ, క్లోరీనూ - రెండూ విపరీతమైన విష పదార్ధాలు. ఈ రెండింటి కలయిక వల్ల పుట్టిన ఉప్పు ప్రాణానికి మూలాధారం. ఆశ్చర్యంగా లేదూ?

ఉప్పులో నిల్వ వేసిన తిండి పదార్ధాలు పాడవకుండా చాల కాలం నిల్వ ఉంటాయని మానవుడు ఎప్పుడో కనుక్కున్నాడు. ఆ రోజులలోనే ఉప్పు వేసిన పదార్ధాలు ఎక్కువ రుచిగా ఉంటాయని కూడ గ్రహించేడు. మనం తినే పదార్ధాల రుచి ఉప్పుదే అంటే అది అతిశయోక్తి కాదు. "చవి" అన్న మాటకి ఉప్పు అనీ, రుచి అనీ రెండు అర్ధాలు ఉన్నాయని మరచిపోకూడదు. ఉప్పు రుచి మరిగిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం కష్టం. ఒక విధంగా కాఫీ అలవాటూ, తాగుడు అలవాటు ఎలాంటివో ఈ ఉప్పు అలవాటు కూడ అలాంటిదే, అక్కడే వస్తుంది మడత పేచీ.

నిజానికి ఉప్పు తినకపోతే బతకలేము. అలాగని గుప్పిళ్ళతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అంటే చెంచాలో పదవ వంతు. ఆ ప్రాప్తికి మనం తినే కాయగూరలలోను, తాగే నీళ్ళల్లోను సహజసిద్ధంగా ఉప్పు లభ్యం అవుతుంది. (నిజానికి జంతుకోటికి కావలసిన ఉప్పు ఇలాగనే సరఫరా అవుతుంది.) అసలు తాగే నీళ్ళల్లో ఉప్పు బొత్తిగా లేకపోతే నీళ్ళకి రుచే ఉండదు. నా మాట మీద నమ్మకం లేకపోతే బట్టీ పట్టిన నీళ్ళని తాగి చూడండి. అయినప్పటికీ మనం వంటలలో ఉప్పు ఎంతగానో వేసుకుంటాం - మన శరీరానికి కావలసి కాదు, జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక. మనకి ఉప్పు అంటే అంత ఇష్టం.

ఇష్టమైనది, శరీరానికి కావలసినది అయిన ఉప్పుని తింటే వచ్చే మడత పేచీ ఏమిటంటారా? చిన్నప్పుడు ఉప్పు తినడం అలవాటు అయిపోతే పెద్దయిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం చాల కష్టం. పెద్దయిన తర్వాత మాత్రం ఎందుకు తప్పించుకోవాలంటారా? మనం పెద్ద అవుతూన్న కొద్దీ గుండెకీ, మూత్ర పిండాలకీ రోగాలు వచ్చే సావకాశం ఎక్కువ. అలాగే రక్తపు పోటు పెరిగే సావకాశాలూ ఎక్కువే. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఈ రోగాలు వస్తాయనడానికి ఏమీ దాఖలాలు లేవు. కాని ఈ జబ్బులు వచ్చేయంటే దానికి పథ్యం ఉప్పు తినడం మానేయడమే. కాని చిన్నప్పటి నుండీ అలవాటు పడిపోయిన ఉప్పుని మానడం చాల కష్టం. కాఫీ అలవాటు తప్పించుకో వచ్చు, సిగరెట్ల అలవాటు ఒదిలించుకో వచ్చు; కాని ఉప్పు అలవాటు అయిపోతే మానడం కష్టం.

వేడి దేశాలలో ఎండలో పని చేసే కూలీలని ఉప్పు బిళ్ళలు తినమని సలహా ఇస్తారు. దాని మాటేమిటి? ఎండలో పనిచేసేటప్పుడు చెమట బాగా పడుతుంది కదా! ఆ ఘర్మజలం తో పాటు ఉప్పు కూడ శరీరం నుండి బయటకు పోతుంది. ఇలా నష్టపోయిన ఉప్పుని భర్తీ చెయ్యమని శరీరం మొర్రో మని పోరు పెడుతుంది. అప్పుడు తాత్కాలికంగా ఉప్పు తినాలి. అప్పుడు ఒక ఉప్పు బిళ్ళని మందు వేసుకున్నట్టు వేసుకోవాలి కాని, ఆ ప్రాప్తికి ఉప్పుని వంటకాలలో కలుపుకుని తింటే ఉప్పు రుచికి శరీరం అలవాటు పడిపోతుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లూ నిజానికి ఉప్పు ఎంత తిన్నా పరవా లేదు. మన శరీరానికి అవసరం లేని ఉప్పుని మన మూత్రపిండాలు సునాయాసంగా తోడెయ్య గలవు. కాని మరే కారణం వల్లనైనా మన మూత్రపిండాలు ఈ పని చెయ్యలేని పరిస్థితి సంభవిస్తే అప్పుడు వస్తుంది మడత పేచీ. గుండె జబ్బు ఉన్నవాళ్లూ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లూ ఉప్పు ఎక్కువ తింటే వారి పరిస్థితి ఉపశమించడానికి బదులు ఉద్రేక పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!

ఏం? ఎందుకని?-6

6. ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే కళ్ల వెంబడి నీళ్లు కారతాయి. ఎందుకని?

ఈ ప్రశ్నకి కొంచెం డొంక తిరుగుడుగా సమాధానం చెబుతాను. కళ్ల్ల వెంబడి నీళ్లు తిరగడమే ఏడుపు కి నిర్వచనం అనుకుంటే మనం మేలుకుని ఉన్నంతసేపూ ఏడుస్తూనే ఉంటాం. నిజానికి కళ్లు మిటకరించినప్పుడల్లా మనం ఏడిచినట్లే లెక్క. ఎందుకంటే మనం మిటకరించినప్పుడల్లా కళ్ల వెంబడి నీళ్లు కారతాయి (దేవతలు కంటి రెప్పలని కదలించరు కనుక వాళ్లు ఎప్పుడూ ఏడవరనే కదా!).

కంటి మొనల దగ్గర ఆశ్రు (లేదా బాష్ప) గ్రంధులు ఉన్నాయి. కంటి రెప్ప వాల్చినప్పుడల్లా కండరాల కదలికకి ఈ గ్రంధులు పితకబడి, ఒక కన్నీటి బొట్టు కంట్లోకి జారుతుంది. ఇదే కంటిని చెమ్మగా ఉంచుతుంది. ఈ చెమ్మదనం లేకపోతే కంట్లో ఇసక వేసినట్లు ఉండి బాధ కలుగుతుంది.

కంట్లో నలక పడ్డప్పుడు రెప్పలు టపటప కొట్టుకుంటాయి. అప్పుడు కంట్లోకి నీరు బాగా స్రవించి ఆ నలకని బయటకు తోలెస్తాయి. కంట్లోకి పొగ వెళ్లినప్పుడు కళ్లు అశ్రువులతో నిండడానికి కూడ కారణం ఇదే.

ఉల్లిపాయ విషయమూ దరిదాపుగా ఇదే. ఉల్లిపాయలో గంధకానికి సంబంధించిన తైలాలు ఉన్నాయి. ఉల్లిపాయని తరిగినప్పుడు ఈ తైలాలకి సంబంధించిన వాయువు కంటిలోని నీటిలో కరిగి గంధకికామ్లంగా మారి కంటిని కలత పెడుతుంది. ఆ కలతని పారదోలడానికి కంటి రెప్పలు టపటప కొట్టుకుంటాయి. దానికి పర్యవసానంగా కళ్లు నీటితో నిండుతాయి.

ఉల్లిపాయని తరుగుతూన్న చేతితో కంటిని నలిపితే పరిస్థితి మరింత ఉద్రేకపూరితం అవుతుంది.

టూకీగా కథ ఇది. ఇదే విషయాన్ని రసాయన శాస్త్రవేత్తని అడిగితే మనకి అర్ధం కాని రసాయనాల పేర్లు, ఫార్ములాలు చెప్పి గాభరా పుట్టించవచ్చు.