Wednesday, October 12, 2011

KCR కి బహిరంగ లేఖ

అన్నా, KCR అన్నా,

తవఁకేనండి, సిన్న మనవి.

మనూరోడివే కదా అనీని, మనోడే కదా అనీని, సొరవ సేసి అడగతన్నా. మనూరోడ్నెలాగయ్యానా? మరి మాదీ బొబ్బిలేగందా. మా ఓళ్లు, మీ ఓళ్లల్లాగే, బొబ్బిలోళ్లే. గత ఏభై ఏళ్ల నుండీ నానమెరికాలో ఉండిపోనానేమో బొబ్బిలి నాకెంత దూరమో నీకూ అంతే దూరం గందా? ఆ మాటకొస్తే నాకంటె నువ్వే బొబ్బిలికి దగ్గరుండావు. నేనూ, నీలాగే, తెలంగణోణ్ణేలే. అందుకే సొరవసేసి అడగతన్నా.

నేను బొబ్బిలోణ్ణంటూ తెలంగాణోణ్ణి ఎలాగయానంటావా, అన్నా? గత మూడేళ్లబట్టీ ఏడాదికి రెండు సుట్లు హన్మకొండ వచ్చి మూడేసి నెల్లు ఉంటన్నా కదా? ఐద్రాబాదు సాల సుట్లు ఏపారానికొచ్చి బోలెడంత డబ్బు తగలెట్టిన. నేనూ తెలంగణోణ్ణే. అందుకని సొరవ సేసి అడగతన్నా.

ఏంటడగతన్నానా? మరేమో, అన్నా. మనకి తెలంగణొచ్చెస్తది కదా. తెలంగాణలో అంటే రైళ్లు ఆపేసినాం కాని, నీ తఢాకాకి ఆంధ్రోడి గుండెల్లోనూ, ఢిల్లియోడి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయన్నా. ఇదే ఊపులో మరొక్క సహాయం చేసి పుణ్యం కట్టుకో అన్నా. సొరవ సేసి అడగతన్నానని ఏఁవనుకోకు.

ఏటి కావాలో సెప్పకుండా ఈ సొద ఏంటని చిరాకు పడకన్నా. మన తెలంగణొచ్చినతరువాతన్నా, మన జాతీయగీతాన్ని కూడ కాసింత మరమ్మత్తు చేయించన్నా. "ద్రావిడ, ఉత్కళ, వంగా" అంటే ఉడుకు రక్తం ఉన్న తెలంగణోళ్లకి ఎలాగుంటుందన్నా? ఆంధ్రోళ్లకి సీవూఁ, నెత్తురూ లేకపోతే పాయె. తెలంగణోళ్లకి ఆత్మగౌరవం ఉందన్నా. ఈ పాటని "ద్రావిడ తెలంగణోత్కల వంగా" అని మార్చే వరకు రైళ్ల రాకపోకలు ఉండవని మరొక బందు ప్రకటించన్నా. మన బొబ్బిలి వీరుల, మన వెలమ దొరల, ప్రతాపం ప్రజలకి చాటి చెప్పన్నా......