Sunday, October 24, 2010

ఏం? ఎందుకని? - 5

5. కేరట్లు తింటే కంటికి మంచిదంటారు. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

కేరటు దుంపలు నారింజ రంగులో పొడుగ్గా ఏకుల్లా ఉంటాయి. ఇవి తింటే కంటికి మంచిది అంటారు. ఇది మంచో కాదో తర్వాత చూద్దాం. ముందు ఈ పుకారు ఎలా పుట్టిందో పరిశీలిద్దాం. కేరట్లలో ఉండే బీటా కేరొటేన్ అనే రసాయనమే విటమిన్ ఎ తయారీకి ముడి పదార్ధం. ఈ విటమిన్ లోపిస్తే రేచీకటి అనే కంటి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ లేకపోతే కండ్లలో చెమ్మదనం పోయి, ఎండి పోతాయి. టూకీగా చెప్పాలంటే పోషక పదార్ధాలలో విటమిన్ ఎ చాల ముఖ్యం. అందులో ఢోకా లేదు. రోజుల తరబడి పొట్ట వీపుకి అంటుకుపోయే అంత గర్భ దరిద్రం అనుభవించే వారిని మినహాయిస్తే సామాన్యులు తినే ఆహారంలో ఈ విటమిన్ దండిగానే ఉంటుంది. కనుక సర్వ సాధారణంగా విటమిన్ ఎ కొరత రాకూడదు. చెప్పొచ్చేదేమిటంటే కంటికి మంచిదని కేరట్లని ప్రత్యేకం మనం తినక పోయినా పరవా లేదు. బీటా కేరొటీన్ ఇంకా అనేక ఆహార పదార్ధాలలో లభిస్తుంది. ఆమాటకొస్తే విటమిన్ మాత్రలు మింగే కంటె విటమిన్‌లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తినటం మంచిది; ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమినులతోపాటు ఇంకా అనేక పోషక పదార్ధాలు ఉంటాయి (ఉ. ఖనిజ లవణములు).

కంటికి మంచిది కదా అని కేరట్లు ఎక్కువగా తిన్నంత మాత్రాన హ్రస్వదృష్టి (near-sightedness or myopia), దీర్ఘదృష్టి లేక చత్వారం (far-sightedness or hypermetropia) వంటి దృష్టి దోషాలు రాకనూ పోవు, ఉన్నవి పోనూ పోవు.

తెలిసో తెలియకో కేరట్లు మరీ ఎక్కువ తింటే శరీరం పచ్చబడుతుంది. ఇది ఆరోగ్యానికి హాని చెయ్యదు కాని, పెళ్లిచూపుల సమయంలో ఏదైనా ఉపకారం చెయ్యొచ్చేమో. నాకు తెలియదండోయ్! కేరట్లు తినటం, శరీరం పచ్చబడటం కేవలం కాకతాళీయం కావచ్చు. కామెర్ల రోగికి కూడ శరీరం పచ్చబడుతుంది. కనుక ఆరోగ్యం విషయంలో సొంత వైద్యం ఎప్పుడూ కూడదు. వెంకటేశ్వరస్వామికి, వైద్యుడికి ముడుపు చెల్లించవలసినప్పుడల్లా బకాయి పెట్టకుండా చెల్లించుకోవటమే మంచిది.

Friday, October 15, 2010

ఏం? ఎందుకని? - 4

4. భోజనం చెయ్యగానే ఈత కొట్టకూడదంటారు? ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఎందుకు కొట్టకూడదు? కొట్టాలని ఉంటే కొట్టొచ్చు! కాని ఈ సూత్రం అర్ధ శతాబ్దం కిందట అమెరికన్ రెడ్‌క్రాస్ వారు ప్రచురించిన పుస్తకంలో, “భోజనం చేసిన వెంటనే ఈత కొడితే కండరాలు కొంకర్లు పోతాయి. ప్రాణం కూడ పోవచ్చు” అని ఉంది. చెప్పింది అమెరికా వాడు. పైపెచ్చు రెడ్‌క్రాస్ వాళ్లు. అందుకని అందరూ నమ్మేసేరు. కాని 1961 లో ఆర్థర్ స్టయిన్‌హవుస్ అనే మరొక అమెరికా ఆసామి ఈ నమ్మకం తర్కబద్ధం కాదనీ, దమ్ములు ఉంటే రుజువు చెయ్యమనీ సవాలు చేసేడు. విజ్ఞానపరంగా ఎవ్వరూ రుజువు చెయ్యలేక పోయారు. అందుకని ఈ మధ్య అమెరికన్ రెడ్‌క్రాస్ వాళ్ళు పై రెండు వాక్యాలనీ వారి పుస్తకం నుండి తొలగించేరు. కనుక భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా? కూడదా?

నూ యార్క్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ కి చెందిన డా. రోషిణి రాజపక్ష అభిప్రాయం ప్రకారం, సామాన్యులు సరదాకి ఈత కొట్టదలుచుకున్నప్పుడు భోజనం చేసిన తరువాత ఈతకొట్టినా పరవాలేదు. కాని ఆ భోజనంతో పాటు రెండు చుక్కలు వేసుకుంటే మాత్రం ఈ సూత్రం వర్తించదు. కేలిఫోర్నియాలో నీళ్లల్లో మునిగిపోయి చచ్చిపోయినవాళ్ల గణాంకాలు పరిశీలించి చూడగా, 41 శాతం మనుష్యుల రక్తంలో ఆల్కహాలు కనిపించిందిట. కనుక “భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా?” అన్న ప్రశ్నకి మీరే సమాధానం చెప్పండి.

Wednesday, October 13, 2010

ఏం? ఎందుకని? - 3

3. కారం తినడం కడుపుకి మంచిది కాదా?

వేమూరి వేంకటేశ్వరరావు

కారం తింటే పొట్టలో పుండు పుడుతుందనే గాథ ఒకటి ఆధ్రేతర రాష్ట్రాలలోనూ – ముఖ్యంగా తమిళనాడులో – ఇతర దేశాలలోనూ చలామణీలో ఉంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే తమిళ సోదరులు చెప్పిన మాటలని విని కాబోలు తెలుగు డాక్టర్లు కూడా సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ పునాదులు లేని పేకమేడలని డాక్టర్ గ్రేం అంటున్నారు. ఈయన టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఉన్న బేలర్ కాలేజ్ అఫ్ మెడిసిన్ లో ఒక పేరు మోసిన ఘనాపాటీ. టెక్సస్ మెక్సికో దేశపు సరిహద్దులో ఉంది కాబట్టి కాబోలు మెక్సికో దేశపు కారం తినే అలవాటు టెక్సస్‌లోనూ కనిపిస్తుంది. అందుకని ఈయనకి కారం అంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు కాని ఈయన కూడ ఈ పుకారులూ వదంతులూ విన్నాడు. విసిగెత్తే వరకూ విన్నాడు. తాడో, పేడో తేల్చేద్దామని ఒక ప్రయోగం చేసేడు.

ఆరోగ్యంగా ఉన్న మనుష్యులని కొంతమందిని కూడ గట్టి వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టేడు. అందులో ఒక జట్టుకి కారం ఏమీ లేని చప్పిడి తిండి పెట్టేడు. రెండవ జట్టుకి అదే చప్పిడి తిండిలో అరడజను ఏస్పిరిన్ మాత్రలు కలిపి పెట్టేడు. మూడవ జట్టుకి బాగా కారం కలిపిన తిండి పెట్టేడు. మరునాడు ఒక బుల్లి విడియో కేమెరాని ఒక గొట్టానికి తగిలించి ఆ గొట్టాన్ని ఈ మూడు జట్ల వాళ్ళ పొట్టలలోకి దింపి క్షుణ్ణంగా పొట్ట గోడలని పరిశీలించేడు. ఏస్పిరిన్ తిన్న రెండవ జట్టు వాళ్ళ పొట్ట గోడలలో చిన్న చిన్న చిల్లుల గుండా రక్తం స్రవించడం చూసేడు తప్ప కారం తిన్న వాళ్ళ పొట్టలు, చప్పిడి తిండి తిన్న వాళ్ళ పొట్టలు ఒక్క లాగే, ఏ దోషం లేకుండా ఉన్నాయిట.

ఇలాంటి ప్రయోగమే భారత దేశంలో కూడ ఎవరో రెండు జట్ల మీద చేసేరుట. ఒకరి తిండిలో మిరప పొడి బాగా జల్లేరుట. మరొక జట్టు తిండిలో మిరప పొడి పొడ కూడా లేదుట. ఈ రెండు జట్ల మధ్య ఏమీ తేడా కనిపించ లేదుట.

ఈ రెండు ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మిరపకాయల వల్ల పొట్టలో పుండు పుట్టదని. నేను కూర్చున్న కుర్చీ లోంచి కదలకుండా స్పురణ ప్రయోగం (థాట్ ఎక్స్పరిమెంట్) ఒకటి చేసేను. దాని సారాంశం ఇది. సర్వ సాధారణంగా వేడి దేశాలలో ఉన్న ప్రజలు కారం ఎక్కువ తినడం నేను గమనించేను. వేడి దేశాలలో ఉన్న వాళ్ళకి చర్మం నల్లగా ఉండడం వల్ల ఉపయోగం ఉన్నట్లే, కారం తినాలనే కోరిక ఉండం వల్ల కూడా మనుగడకి పనికొచ్చే లాభం ఏదైనా ఉందేమో? డార్విన్ ని అడిగి చూడాలి.

Monday, October 11, 2010

ఏం? ఎందుకని? - 2


2. నోరు కారంతో చుర్రుమన్నప్పుడు నీళ్ళు తాగడం వల్ల నోరు చల్లారదు. ఎందుకని?


వేమూరి వేంకటేశ్వరరావు

మనం తినే ఆహారంలోని కారం ఒక రకమైన జిడ్డు పదార్ధం. అంటే నూనెతో కలసిన పదార్ధం. నూనె, నీళ్ళు కలవవు. కనుక కారం నోటితో నీళ్ళు తాగితే గోడమీద పోసిన నీళ్ళలా గొంతుకలోకి పోతాయి తప్ప నాలికమీద ఉన్న కారాన్ని కడిగెయ్యవు. నోరు కారం అయినప్పుడు చిన్న బన్‌రొట్టి ముక్క తింటే ఆ రొట్టి కారంలో ఉన్న జిడ్డు పదార్ధాన్ని పీల్చుకుంటుంది. రొట్టి లేకపోతే గుక్కెడు పాలు తాగినా పని చేస్తుంది. పాలలో కేసిన్ అనే ప్రాణ్యం (protein) ఉంది. అది జిడ్డు పదార్ధం మీద కుంకుడు నురుగులా పని చేస్తుంది. కారం ధాటిని తగ్గించడానికి తెలుగు దేశంలో మరొక చిటకా ఉంది. కారంగా ఉన్న నోటిలో చిన్న ఉప్పు బెడ్డ వేసుకుంటే కారానికి ఉప్పు విరుగుడులా పని చేస్తుందని అంటారు. ఈ నమ్మకం వెనక విజ్ఞానపరమైన వివరణ ఏదైనా ఉందేమో నాకు తెలియదు

Friday, October 8, 2010

ఏం? ఎందుకని? - 1

1. వర్షం పడ్డప్పుడు వానపాములు చపటాలమీదకి ఎందుకు ఎగబాకుతాయి?

మీరు ఎప్పుడైనా గమనించేరో లేదో, వర్షం పడ్డ తర్వాత నేల లోని వానపాములు బయటకొచ్చి, పొడిగా ఉన్న గచ్చు మీదకి, చపటాల మీదకి, రోడ్ల మీదకి ఎగబాకుతాయి. నిజానికి అప్పుడే మనకి వానపాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? వానపాములు మనలాగే గాలి పీల్చి బతుకుతాయి. వాన పడ్డప్పుడు వాటి శ్వాస రంధ్రాలు నీళ్ళతో నిండిపోతాయి కనుక వాటికి ఊపిరి సలపదు. అందుకని అవి పొడిగా ఉన్న స్థలాలలకి ఎగబాకుతాయి. అని సిద్ధాంతం. నిజం వానపాములకే తెలియాలి.

Sunday, September 26, 2010

గుడ్లు తినటం గుండెకి మంచిది కాదా?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్లు మరీ ఎక్కువయిపోయారు. ఎవ్వరిమాట విని చావాలో తెలిసి చావటం లేదు.

ఉదాహరణకి గుడ్డట్టు (ఆమ్లెట్ కి తెలుగులో వచ్చిన తిప్పలు) వేసుకుందామని కోడిగుడ్డుని పగలగొట్టేను కదా!

“ఆ పచ్చని తీసి పారేసి తెల్లసొనతో వేసుకొండి. ఆ పచ్చసొన అంతా కొలెస్టరాలే. మీ గుండెకి మంచిది కాదు” అంటూ ఉచితంగా ఒక సలహా పారేసింది – ఇంకెవరు! మా శ్రీమతి!

నాలోని సైంటిస్టు కుతూహలంతో కుతకుతలాడేడు. లాడడూ?

నిజంగా పచ్చసొన తింటే గుండెకి హాని కలుగుతుందా? ఎవ్వరు చెప్పేరు?

మనకి తెలుసున్న విషయాలు ఇవి: ఒక సగటు గుడ్డులో సుమారు 210 మిల్లీగ్రాములు కొలెస్టరాలు ఉంటుంది. నిజమే! అంతే కాదు. మన రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధం చాల మట్టుకు కొలెస్టరాలే! రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధాలు – పాలల్లో వెన్నలా తేలిపోయి - గుండెకి సరఫరా చేసే రక్తనాళాలలో మేట వేసి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినప్పుడు గుండెపోటు (heart attack) వస్తుంది. అదీ నిజమే. కాని మనం కొలెస్టరాలు ఉన్న తిండి పదార్ధాలు తినటం వల్ల గుండెపోటు వస్తుందనటం కొచెం నిజాన్ని సాగదియ్యటమే అవుతుంది.

మనలో - చాల మందిలో - కోలెస్టరాలు తిన్నంత మాత్రాన రక్తప్రవాహంలో కొలెస్టరాలు మట్టం పెరగదు. (పొట్లకాయ తిన్నంత మాత్రాన పొడుగెదుగుతామా?) ఆ మాటకొస్తే, మనం ఆహారం ద్వారా కొలెస్టరాలుని సరఫరా చేసిన పక్షంలో శరీరం తను ఉత్పత్తి చేసే కొలెస్టరాలుని తగ్గిస్తుంది. కనుక తినే తిండిలో ఉన్న కొలెస్టరాలుకీ, రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలుకీ మధ్య బాదరాయణ సంబంధం ఉంటే ఉండొచ్చు గాక; అది మాత్రం దగ్గర సంబంధం కాదు.

నిజానికి రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలు మట్టం పెంచటానికి దోహదపడే కారణాంశాలు (factors) రెండు ఉన్నాయి. అవి – సంతృప్త గోరోజనామ్లాలు (saturated fatty acids) , అడ్డు గోరోజనాలు (trans fats). ఈ రెండు కారణాంశాలు ఒక గుడ్డులో కేవలం 2 గ్రాముల ప్రాప్తికి మాత్రమే ఉంటాయి.


అమెరికన్ హార్ట్ ఎసోషియేషన్ చేసే సిఫార్సు ప్రకారం ఆరోగ్యవంతులు రోజుకి 300 మిల్లీగ్రాముల వరకు కోలెస్టరాల్ ని నిర్భయంగా తినొచ్చు. గుండెజబ్బు చరిత్ర ఉన్నవాళ్లు అయితే 200 మిల్లీగ్రాములతో సరిపెట్టుకోవాలి. ఈ లెక్కన ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రోజుకో గుడ్డు తిన్నంతమాత్రాన్న మరేమీ కొంప ములిగిపోదు. గుండె ఆరోగ్యం సరిగ్గా లేని వారు వారానికి రెండు గుడ్లు తింటే మరేమీ పరవా లేదు.

ఇవన్నీ ఉచితమైన సలహాలు. మీ డాక్టరుకి ముట్టజెప్పవలసిన ముడుపు ముట్టజెప్పి అప్పుడు ఆ వైద్యుడు చెప్పినట్లు చెయ్యటం సర్వదా శ్రేయస్కరం.

Sunday, September 12, 2010

ఏమి సమంజసం?

జూలై 2010 రచన మాసపత్రికలో శ్రీకాకుళం నుండి ఎన్. బి. ఆర్. కె. భాను అనే ఆసామీ రాసిన ఒక ఉత్తరానికి స్పందిస్తూ శాయి ఒక సంపాదకీయం రాసేరు. ఆ పాఠకుని ఉత్తరం, ఆ సంపాదకీయాల సారాంశం: దేశంలో ప్రతి సంస్థకీ, కట్టడానికీ, జిల్లాకి, ఒక రాజకీయనాయకుడి పేరు పెట్టెయ్యటం ఏమి సమంజసం? నిజమే! రంగారెడ్డి జిల్లా, రాజశేఖరరెడ్డి జిల్లా అనుకుంటూ పోతే కొన్నాళ్లకి జిల్లాలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఊళ్లమీద పడతారు కాబోలు. కాకినాడ పేరు పళ్లంరాజు, తుని పేరు బుల్లిబాబు అవుతాయి కాబోలు. హైదరాబాదు పేరు కె. సి. ఆర్ గా మార్చాలనే కోరికతోటే తెలంగాణా ఉద్యమం ఆయన ప్రారంభించేడేమో కనుక్కోవాలి. ఢిల్లీ పేరు సోనియా అని మార్చేసి ఇండియా పేరు గాంధీ అని పెట్టేస్తే ఈ గొడవ తీరిపోతుందేమో!

Saturday, July 31, 2010

ఈ-టపా చిరునామా పలకటం ఎలా?

నాకొక ధర్మసందేహం వస్తోంది. నేను ఇండియా వచ్చినప్పుడల్లా నాకొక ధర్మసందేహం వస్తోంది.

నా విద్యుల్లేఖ చిరునామా name@gmail.com అనుకుందాం. దీన్ని అమెరికాలో అయితే "నేం ఎట్ జి-మెయిల్ డాట్ కాం" అని చదువుతాం.

ఇండియాలో చాలమంది ఇదే చిరునామాని "నేం ఎట్ ద రేట్ ఆఫ్ జి-మెయిల్ డాట్ కాం" అని అంటారు.

"ఎట్ ద రేట్ ఆఫ్" అన్నప్పుడు ఏదో కొంత జోరుగా పరిగెడుతున్నాదనే అర్ధం స్పురిస్తున్నాది కదా. ఇండియాలో పద్ధతి ప్రకారం ఈ-మెయిల్ "జి-మెయిల్ డాట్ కాం" అంత జోరుగా పరిగెడుతున్నాదనే కదా అర్ధం.

ఇది జీర్ణించుకోలేక నేను ఇండియన్ పద్ధతి తప్పు అని చెప్పి చూసేను.

"మీ అమెరికా వాళ్లు చేసినట్లే ప్రపంచం అంతా చెయ్యాలని రూలు ఏమయినా ఉందా? మేము "నేం ఎట్ ద రేట్ ఆఫ్ జి-మెయిల్ డాట్ కాం" అనే అంటాం" అని మొండికేసేరు.

మీరేమంటారు?

Wednesday, March 17, 2010

Pardon me for posting this in English.

The UN has conducted a Worldwide survey. The question asked was:

*****************
"Would you please give your honest opinion about solutions to the food shortage in the rest of the world?"

*****************

The survey was a huge failure because ----

In Africa they didn't know what 'food' meant.
In India they didn't know what 'honest' meant.
In Europe they didn't know what 'shortage' meant.
In China they didn't know what 'opinion' meant.
In the Middle East they didn't know what 'solution' meant.
In South America they didn't know what 'please' meant.
And in the USA they didn't know what 'the rest of the world' meant!

Tuesday, January 19, 2010

నాకు తెలియక అడుగుతాను

నాకు తెలియక అడుగుతాను, మరేమీ అనుకోకండి.
ఒక పక్క
దేశంలో దరిద్రం తాండవిస్తోంది.
లంచగొండితనం పరాకాష్ఠనందుకుంటోంది.
అవస్థాపన సౌకర్యాల స్థితి అధ్వాన్నంగా ఉంది.

మరోపక్క
చైనావాడు
మనా భూభాగాన్ని అంగుళం అంగుళం చొప్పున కబళించెస్తున్నాడు
అరుణాచల ప్రదేష్ అంతా తనదే అంటున్నాడు
దేశంలోకి చొరబడ్డమే కాకుండా మన కలన వలయాలలోకి కూడ చొరబడి
మన దేశపు అస్తిత్వానికే ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు

మరోపక్కనుండి
పాకిస్తాను వాడు
ముంబాయి మీద దండెత్తి
ఘజినీ, గోరీ రోజులు గుర్తుకు తెస్తున్నాడు

ఇన్ని సాధించవలసిన సమశ్యలు ఉండగా
మన తెలుగు విద్యార్ధులు
భావి భారత పౌరులు
నవయుగపు రథసారధులు
ఏమిటి చేస్తున్నారు?

రాజకీయనాయకుల చేతులలో చదరంగపు పావులుగా మారి
సొంతంగా ఆలోచించటం మాని
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

విశ్వవిద్యాలయాల్లో నేర్వవలసినది విచక్షణా జ్ఞానం
బుర్రలేని గొర్రెపోతులా కసాయివాడి వెనక నడవడం కాదు

Thursday, January 7, 2010

తెలుగు దేశానికి పట్టిన దుర్గతి

తెలుగు వాళ్ళకి మరో పని లేదా? చీటికీ మాటికీ వీధిన పడి దౌర్జన్యకాండ జరపటం తప్ప మనవాళ్ళకి మరో పని ఉన్నట్లు లేదు. ఎక్కడో, ఎవ్వరో అనామకులు అంతర్జాలంలో ఒక కూత కేసే సరికి ముందూ, వెనకా ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా వీధిన పడి కనిపించినవి అన్నీ కాల్చెయ్యటమేనా? ఒక "వెబ్ సైటు" స్థాపించటం అనేది అయిదు నిమిషాల పని. మరొకరి పేరు మీద ఈ-టపాలు పంపటం అర నిమిషం పని. తెలుగు వాళ్ళని ఇంత సులభంగా బుట్టలో వేసుకోవచ్చని మన దేశపు శత్రువులకి తెలిస్తే వారు వెబ్ సైటు లని, ఈ-టపాలని ఉపయోగించి మనకీ పాకిస్తానుకీ (కాకపోతే మనకీ- చైనాకి, ఏదో మాటవరసకి అంటున్నాను) ఒక్క కలం పోటుతో కలత పెట్టొచ్చు. ఆలోచించండి. రిలయన్సు వారు నా బావ మరదులు కారు. రాజశేఖరరెడ్డి చావుకి మరొక కారణం చెప్పేడు హైదరాబాదులో టేక్సీ తోలేవాడు. హెలికాప్టరు చోదకుడు మందులకి లొంగని కేన్సరుతో బాధపడుతున్నాడుట. అతని చావు ఎలాగూ తథ్యమేనని అతని వారసులకి కోట్ల కొద్దీ డబ్బు ఇచ్చి, ఆ చోదకుడిని ఆత్మహత్య చేసేసుకోమన్నారుట. ఎవ్వరు? రాజశేఖరరెడ్డి మరణిస్తే లాభం పొందే వారు. చోదకుడు వారి పేర్లు కూడా చెప్పేడు. అసలే ఆంధ్రదేశం ఉడికిపోతోంది. ఇప్పుడు ఆ పేర్లు మళ్ళా చెప్పేనంటే ఇంకేమయినా ఉందా!

ఇందిరా గాంధీ చచ్చిపోయిన తరువాత రాజివ్ గాంధి ప్రధాని అయిన రోజునే ధీరూభాయి అంబానీ అర నిమిషం సేపు రాజివ్‌తో ముఖస్తంగా మాట్లాడటానికి అవకాశం ఇమ్మని ఆ అర నిమిషంలోనూ "అమ్మ గారికి ఎప్పుడైనా ఏదైనా అయితే అప్పుడు ఈ కాగితం మీకు ఇమ్మన్నారు" అని నెంబర్లు ఉన్న కాగితం ఒకటి అందించేడుట. రాజివ్ అర నిమిషం కాదు అరగంట మాట్లాడేడుట. ఇటువంటి హాస్యోక్తులలో గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ తారాగణం అంతా ప్రస్తుతం దివంగతులై ఉండటం.

సర్దార్‌జీ జోకులు లాంటివే ఈ కథలు కూడ. కడుపులో చల్ల కదలకుండా, కాలు మెదపకుండా ఇటువంటి కథలు ఎవ్వరయినా అల్లగలరు. అలాగే కాలక్షేపానికో, కోతిచేష్టలు చెయ్యటానికో పనిలేని ఒక కుర్ర మంగలి ఈ అంబానీ జోకుని తయారు చేసి తన “ఇంటిపుట” (హోంపేజి వచ్చిన తిప్పలు) లో పెట్టుకున్నాడుట. అంతకంటె పనిలేని పెద్ద మంగళ్ళు రిలయన్సు షాపులమీదకి దండయాత్ర చేస్తూ ఉంటే మన రాజకీయ వినాయకులు “శాసనోల్లంఘన చేసిన విద్యార్ధులకి క్షమాబిక్ష పెట్టాలి” అని ఒత్తిడి తెస్తూ ఉంటే తెలుగువాళ్ళంతా కలసి కట్టకట్టుకుని ఏ గంగలోనో దూకాలి తప్ప మరో మార్గం లేదు.