Sunday, February 8, 2009

ఇచ్చుటలో ఉన్న హాయి...

ఫిబ్రవరి 8, 2009, ఆదివారం ఈనాడు పత్రికలో దానం చెయ్యటంపై ఒక సంపాదకీయం పడింది. అది అందరూ చదవదగ్గది. అందుకని దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను.
http://www.eenadu.net/homelink.asp?qry=Editorial

ఈ లంకె ఎన్నాళ్ళు తాజాగో ఉంటుందో తెలియదు కనుక, ఆ వ్యాసాన్ని యధాతథంగా ఈ దిగువ చూపుతున్నాను. ఈ బ్లాగులో, గతంలో, అత్త(వా)గారి సొమ్ము అనే ఒక వ్యాసం ఉంది. అదికూడా ఈ సందర్భంలో మళ్ళా చదవదగ్గది.

ఇదిగో ఈనాడు సంపాదకీయం

ఇచ్చుటలో ఉన్న హాయి...

'వచ్చినవాడు వామనుడు కాడు, శ్రీమన్నారాయణుడు... దానం మాట మర్చిపో... లేకుంటే ఆయన మాయకు బలి అవుతావు' అని బలిచక్రవర్తిని శుక్రాచార్యులు గట్టిగా హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి వినలేదు. 'మాట ఇచ్చాను... దానం చేసి తీరవలసిందే... తిరుగన్నేరదు నాదు జిహ్వ, వినుమా ధీవర్య వేయేటికిన్‌' అన్నాడు. ఆ ప్రకారమే ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. తన సహజ కవచకుండలాలు అపహరించడానికి స్వయంగా దేవేంద్రుడే యాచకుడిగా వస్తున్నాడని కర్ణుడికి ముందే తెలిసింది. అయినా చలించలేదు. '...విప్రులు కడునర్థివేడిన బొచ్చెంబు సేయక ఇచ్చుట... నాకు వ్రతం... ఆ వ్రత నియమాలకి తిరుగులేదు' అన్నాడు. అన్నట్టుగానే దానమూ చేశాడు. దగ్గరున్నదంతా దానధర్మాలకు వెచ్చించి వట్టి చేతులతో మిగిలాడు రంతిదేవుడు! ఆ స్థితిలో మరో దీనుడు వచ్చి చేయి చాచాడు. 'అన్నము లేదు... కొన్ని మధురాంబువులున్నవి... త్రావుమన్న... రావన్న!' అంటూ వాణ్ని చేరదీసి ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి నిశ్చింతగా నిలబడ్డాడు. మొన్న మొన్నటిదాకా మన మధ్యన జీవించిన మహాతల్లి డొక్కా సీతమ్మదీ అదేవరస. 'వరద గోదారి పోటుమీద ఉంది, పడవ ప్రయాణం ప్రమాదమమ్మా!' అని సరంగులు వారించారు. అయినా ఆవిడ వినలేదు. లంకల్లో చిక్కడి, ఆకలితో అల్లాడుతున్న దీనులకోసం వేడిగా వండి వార్చి పట్టుకెళ్ళి వడ్డించింది. పాప పుణ్యాల సంగతి కాదు ఇక్కడ చూడవలసింది. 'దానం చేస్తే పుణ్యం వస్తుంది' అనుకుంటూ దానాలు చేసిన బాపతు కాదు వారెవరూ! దాతృత్వం వారి సహజ స్వభావం అంతే! తమ దగ్గర ఉన్నది సంతోషంగా ఇచ్చే లక్షణం కారణంగా వారంతా చరిత్రలో నిలిచిపోయారు. వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ధన్యజీవులంటున్నాం!

చప్పని వట్టిగడ్డిని తినిపించినా- గోవులు కమ్మని పాలు ఇస్తాయి. మురికినీటిని తెచ్చి తమలో కలిపేస్తున్నా సహించి, నదులు తియ్యని నీళ్లు ఇస్తాయి. తనని నరకడానికి వచ్చినవాడికి సైతం చెట్లు చల్లని నీడ ఇస్తాయి. ఇవ్వడం వాటి స్వభావం! అందుకే వాటికి లోకంలో పూజార్హత! అపకారం చేసినవాడిని సైతం ..పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు... అనే గొప్ప లక్షణాన్ని మనిషి వాటినుండే నేర్చుకున్నాడు. రుచికరమైన ఆహారాన్ని ఒక్కడివీ కూర్చుని తినకు. ఏకఃస్వాదు న భుంజీత... అని భారతం ఆదేశించింది. దాన్ని పాటించేవారు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. వారిని సజ్జనులు అంటారు. వారివల్లే ఈమాత్రం అయినా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి- అని లోకం భావిస్తుంది. దానగుణం అనేదాన్ని గొప్ప లక్షణంగా లోకం గుర్తించింది. ఆలికి అన్నం పెట్టడమే ఊరికి గొప్ప ఉపకారమనుకునే జనం సంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో, పరాయివాడికి సహాయం చేద్దామని ఎవరైనా అనుకుంటే చాలు- లోకం హర్షిస్తుంది. వారికి జేజేలు పలుకుతుంది. వారిని దేవుళ్లలా చూస్తుంది. 'అనాథాశ్రమం కట్టడానికి చందా కావాలి' అని వస్తే- 'నా దగ్గరేముంది ఇవ్వడానికి! నా ముసలి తల్లితండ్రులను మీ సమాజానికి జమ వేసుకోండి' అని అంటగట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అలాంటివారికి ఇవ్వడంలో ఉండే గొప్ప అనుభూతి ఎన్నటికీ తెలియదు. తన స్తనాన్ని పసిబిడ్డ నోట కరచి పట్టుకుని తియ్యని పాలని ప్రేమగా జుర్రుకుంటుంటే- తన జీవాణువుల్లోని మాతృత్వపు మహామాధుర్యాన్ని పాల రూపంలో బొట్టు బొట్టుగా బిడ్డ లేత పెదవులపై జార్చే అమ్మ- ఆ క్షణాన ఏ దేవతకైనా తీసిపోతుందా? ప్రమాదానికి గురై రక్తం ఓడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుడికి మన శరీరంలోని రక్తం నెమ్మదిగా ప్రాణం పోస్తుండగా, ఆ జీవి క్రమంగా తేరుకుని మొహం తేటపడుతుంటే మనకు కలిగే ఆనందం బ్రహ్మానందానికి తీసిపోతుందా! ఆ క్షణాన మనం దేవతలతో సమానం కామా? మరణానంతరం మన కళ్లు మరో అంధుడి కళ్లకి వెలుగునిచ్చి ఈ లోకాన్ని తృప్తిగా పరికిస్తుంటే - మనం ఇంకా జీవించి ఉన్నట్లు కాదా! ఆ మేరకు మనం అమరులం అయినట్లే కదూ! అవును! దానగుణం మనల్ని దేవతలను చేస్తుంది.

మనలో కొన్ని అపోహలు స్థిరపడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటే మగతనం సన్నగిల్లుతుందనీ, రక్తం దానం చేస్తే ప్రాణం నీరసపడుతుందనీ, కళ్లు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డివాడిగా పుడతామనీ.. ఏవేవో దురభిప్రాయాలు మనలో పాతుకుపోయాయి. ఇదంతా వట్టి అవివేకమని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నిజానికి రక్తదానం చేసినప్పుడు ఆ మేరకు తిరిగి రక్తాన్ని ఉత్పత్తి చేసుకునే వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. కొద్ది గంటల్లోనే శరీరానికి అవసరమైనంత రక్తం తయారవుతుంది. అంతేకాదు, శరీర భాగాలను దానం చేసిన వారికి ఆరోగ్యమూ, ఆయుర్దాయమూ పెరుగుతాయన్న ఒక గొప్ప విశేషాన్ని పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాలను దానం చేసినవారి ఆరోగ్య స్థితిగతులపై సుదీర్ఘ పరిశీలన నిర్వహించిన అమెరికాలోని మినెసొటా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఈ సంచలన విషయాన్ని ప్రకటించింది. 'న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌'లో ప్రచురితమైన డాక్టర్‌ హసన్‌ ఇబ్రహీం బృందం పరిశోధన ప్రకారం- మూత్రపిండాలు దానం చేసినవారు మరింత ఆరోగ్యంగాను, ఆయుర్దాయంతోను నిశ్చింతగా జీవిస్తున్నట్లు స్పష్టం అయింది. గతంలో నార్వే, స్వీడన్‌లలో చేపట్టిన ఇదేరకం అధ్యయనాలు సైతం ఈ విషయాన్నే నిర్ధారించడం గమనించదగిన విశేషం. మనిషి శరీరంలోని భాగాలను సైతం దానం చేసినా హాని జరగదు సరికదా- ఆరోగ్యం మెరుగవుతుంది, ఆయుర్దాయమూ పెరుగుతుందన్నది విజ్ఞాన శాస్త్రం తేల్చి చెప్పింది. మనిషికి వరంగా లభించే దేహంలోనే ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పుడు- దానం మూలంగా మనిషి స్వయంగా సంపాదించుకున్న సిరిసంపదలలో కొంతభాగం ఇచ్చేస్తే కోలుకోలేమనడం శుద్ధ అవివేకం కదా! ఏమంటారు?

1 comment:

  1. వేమూరి రావు గారు, ప్రస్తుత సమాజం గ్రహించవలసిన అత్యంత ముఖ్యమైన విలువ ఈ సంపాదకీయంలో ఉంది. దీన్ని బ్లాగు ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete