Saturday, February 19, 2011

ఏం? ఎందుకని? - 14

14. మూత్రం సాధారణంగా పసుపుపచ్చగా ఉంటుంది. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ రకం ప్రశ్నలకి భౌతిక శాస్త్రం ఒక రకమైన సమాధానం చెబుతుంది, రసాయన శాస్త్రం మరొక కోణం ద్వారా సమాధానం చెబుతుంది. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ఆకులు ఎందుకు ఆకుపచ్చగా ఉంటాయి? ఆన్న ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లే ఇక్కడా చెప్పొచ్చు. కాని ఈ విషయానికి ఇక్కడ రసాయన శాస్త్రపు దృక్కోణం బాగా ఉపయోగ పడుతుంది. మూత్రానికి రంగు రావడానికి మూత్రం లో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే ఎర్రటి రంగు పదార్ధం. ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్ బైలిరూబిన్ గానూ, తదుపరి యూరోక్రోం గానూ విచ్చిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలు లో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్లు తాగినప్పుడు మూత్రం కూడ ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ల రంగులో కాని ఉంటుంది. నీళ్లు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది. ఈ పరిస్తితిలోనే మనవాళ్లు వేడి చేసిందంటారు. చలవ చెయ్యడానికి మజ్జిగ తాగమంటారు. మజ్జిగే అక్కర లేదు, మంచినీళ్లు తాగినా సరిపోతుంది; కాని అనుకోకుండా మంచి మజ్జిగ తాగే అవకాశం వస్తే ఎందుకు వదలుకోవాలి? (నా చిన్నతనంలో మంచి, చిక్కటి పాలు, మజ్జిగ తాగే అవకాశమే ఉండేది కాదు. అందుకనే ఇలా రాసేను.) మూత్రానికి పసుపు రంగు తప్ప మరే ఇతర రంగు ఉన్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది కాని ఎన్నడు సొంత వైద్యం చేసుకోకూడదు.

No comments:

Post a Comment