Monday, February 21, 2011

ఏం? ఎందుకని? - 15

15. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఆకులన్నీ ఆకుపచ్చగా ఉండవు కాని, చాల మట్టుకు ఉంటాయి. ఆకుపచ్చ వృక్షసామ్రాజ్యపు పతాక వర్ణం. ఈ ఆకుపచ్చకీ వృక్షసామ్రాజ్యానికి మధ్య ఉన్న లంకె ఏమిటో చూద్దాం. మనం బతకడానికి మనకి శక్తి ఎలా కావాలో అదే విధంగా చెట్లు బతకడానికి కూడా వాటికి శక్తి కావాలి. ఈ శక్తి ఆహారం నుండి లభిస్తుంది. మనం బద్ధకిష్టులం గనక ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒక చెట్టు నుండి ఒక కాయో, పండో కోసుకు తినేస్తాం. మొక్కలు ఆ పని చెయ్యలేవు కదా. ఆందుకని మొక్కలు తమకి కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకొంటాయి. ఈ తయారీ అంతా ఆకులలో జరుగుతుంది. అంటే ఆకులు మొక్కలకి ఆహారం తయారు చేసిపెట్టే కార్ఖానాలు.

అన్ని కార్ఖానాలకి మల్లే వీటికి కూడ ముడి పదార్ధాలు కావాలి కదా? అందుకని మొక్క భూమి నుండి నీళ్లనీ, పోషక పదార్ధాలనీ, గాలి నుండి బొగ్గుపులుసు వాయువునీ పీల్చుకుంటుంది. ఈ రెండింటిని రసాయన సంయోగం పొందించి ఆహారం తయారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియకి శక్తి కావాలి కదా. ఆ శక్తి సూర్య రస్మి సరఫరా చేస్తుంది. ఈ పద్ధతినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ సంయోగం ఫలోత్పాదకంగా జరగాలంటే ఒక మధ్యవర్తి సహాయం కావలసి ఉంటుంది. అటువంటి మధ్యవర్తిని రసాయనశాస్త్రంలో కేటలిస్టు అంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో వాడే కేటలిస్టు పేరు పత్రహరితం. దీన్ని పైరుపచ్చ అని కూడ అంటారు. ఇంగ్లీషులో 'క్లోరోఫిల్'. ఈ పత్రహరితాన్ని మొక్కలు తమకి తామే తయారు చేసికొంటాయి. ఈ పత్రహరితం ఆకుపచ్చ రంగులో ఉంటుంది కనుక, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి.

మొక్కలు పత్రహరితం తో పాటు ఇంకా అనేక ఇతర రసాయనాలని తయారు చేసుకుంటాయి. పత్రహరితం ఆకుపచ్చ రంగుని ఇచ్చినట్లే 'క్సేంతోఫిల్' అనే పదార్ధం పసుపు పచ్చ రంగుని ఇస్తుంది. కేరోటిన్ నారింజ రంగుని పోలిన ఎరుపు రంగుని ఇస్తుంది. 'ఏంథోసయనిన్' ఎర్రని ఎరుపు రంగుని ఇస్తుంది. ఈ 'ఏంథోసయనిన్' ఏపిలు పళ్ళకి తీపిని, ఎరుపుని ఇస్తుంది. సర్వసాధారణంగా పత్రహరితం పాలు ఎక్కువ ఉండడం వల్ల పచ్చ రంగు ధాటి ముందు మిగిలిన రంగులు వెలవెలబోయి, ఆకులు పచ్చగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment